‘మా’ రెండు ముక్కలు.. విజయశాంతి సపోర్ట్ !

తెలుగు రాష్ట్రాలు విడిపోయినా.. తెలుగు సినీ పరిశ్రమ ఇంకా విడిపోలేదు. హైదరాబాద్ వదిలి ఏపీకి పోలేదు. పోయే ఉద్దేశం కూడా లేనట్టుంది. ఏపీ సీఎం జగన్ ఎన్నో వరాలు ఇస్తానని సంకేతాలు ఇచ్చినా.. చలనం లేదు. అయితే మా ఎన్నికల నేపథ్యంలో మా రెండు భాగాల డిమాండ్ తెరపైకి వచ్చింది. మా ఎన్నికల బరిలో దిగుతున్నట్టు ప్రకటించిన సీనియ‌ర్ న‌టుడు సీవీఎల్ న‌ర‌సింహారావు ఈ డిమాండ్ ని తెరపైకి తెచ్చారు.

తన ప్యానల్‌ తెలంగాణ వాదంతో ముందుకొస్తుంద‌ని, సినిమా అవకాశాల్లో తెలుగు వారికి న్యాయం జరగాలనే డిమాండ్‌తో స్వ‌తంత్రంగా బ‌రిలో నిలుస్తున్న‌ట్టు నరసింహారావు ప్ర‌క‌టించారు.  ‘మా’కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో రెండు విభాగాలు చేసి, రెండింటికీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆయన డిమాండ్ కు మద్దతి ఇస్తున్నట్టు లేడీ సూపర్ స్టార్,  బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి ప్రకటించారు. సీవీఎల్ నరసింహారావు ఆవేద‌న న్యాయ‌మైంద‌ని, ధ‌ర్మ‌మైంద‌ని చెప్పుకొచ్చారు.

మా రెండు ముక్కల డిమాండ్ కు విజయశాంతి సపోర్ట్ లభించింది. అంటే.. తెలంగాణ బీజీపీ మద్దతు లభించినట్టే. ఈ వాదానికి టీఆర్ఎస్ బాహాటంగా నో చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ? తెలంగాణవాదంతోనే ఉద్యమం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ నేపథ్యంలో మా విభజనకు రాజకీయ రంగు పులుముకోనుంది. మరింత హీటెక్కనున్నాయి.