అలర్ట్ : తెలంగాణలో 2రోజుల పాటు ఆన్ లైన్ సేవలు బంద్

తెలంగాణలో రెండ్రోజుల పాటు ప్రభుత్వ ఆన్ లైన్ సేవలు బంద్ కానున్నాయి. యూపీఎస్‌ స్థాయి పెంపు నేపథ్యంలో అంతరాయం కలగనుంది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ భవనంలోని రాష్ట్ర డేటా కేంద్రం (ఎస్‌డీసీ)లో కొత్త యూపీఎస్‌ యూనిట్‌ ఏర్పాటు దృష్ట్యా ఈ నెల 9వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 11న రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రభుత్వ వెబ్‌సైట్లకు అంతరాయం కలగనుంది. ఆ రెండు రోజులు ప్రభుత్వపరమైన ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోనున్నాయి.

రాష్ట్రంలో ఈ సేవలు పెరుగుతుండగా విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న యూపీఎస్‌(అన్‌ఇంటరప్టబుల్‌ పవర్‌ సప్లై) యూనిట్‌ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో స్థాయిని పెంచాలని నిపుణులు సిఫార్సు చేశారు. దీనికి అనుగుణంగా కొత్త యూపీఎస్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యూపీఎస్‌ స్థాయి పెంపు నేపథ్యంలో శుక్రవారం రాత్రి 9 నుంచి ఆదివారం రాత్రి 9 గంటల వరకు అంతరాయం ఏర్పడనుంది. దీనిపై ఇప్పటికే అన్ని శాఖలకు ప్రభుత్వం సమాచారం అందించింది.