శంకర్-చరణ్ సినిమాకు బుర్రా మాటలు

ఆయన మాటకు పదునెక్కువ. అవి తూటాల్లా దూసుకుపోతాయ్. నేరుగా గుండెల్లో గుచ్చుకుంటాయ్. అక్కడితో ఆగవు. మనతోనే వస్తాయ్. మనతో కలిసి జీవిస్తాయి. నవ్విస్తాయి. ఏడిపిస్తాయ్. ఆలోచింపజేస్తాయ్. మనతో కలిసి కాపురం చేస్తాయి. ఎలాంటి క‌థ‌కైనా.. చురుకైన‌, సొగ‌సైన‌, లోతైన మాట‌ల్ని రాయ‌డంలో ఆయ‌న పండిపోయారు. ఇప్పటికే అర్థమై పోయి ఉంటుంది. ఆయన ఎవరు ? అన్నది. బుర్రా సాయి మాధవ్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు మాటలు రాసిన బుర్రాకు.. మరో గొప్ప అవకాశం దక్కింది.

గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ చిత్రానికి డైలాగ్ రైట‌ర్ గా బుర్రా సాయిమాధ‌వ్ ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సాయిమాధవ్ నే తెలిపారు. “జెంటిల్ మేన్ సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఓఫోటో దిగితే ఈజీవితానికి చాలనుకున్నాను. ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను” అంటూ ట్విట్ చేశారు.

ప్రస్తుతం సాయి మాధవ్ చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. రామ్ – లింగు స్వామి సినిమాకీ బుర్రానే డైలాగ్ రైట‌ర్‌. బాల‌కృష్ణ – గోపీచంద్ మ‌లినేని కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. దీనికీ ఆయ‌నే ర‌చ‌యిత‌. ప్ర‌భాస్ – నాగ అశ్విన్ సినిమా కూడా సాయిమాధ‌వ్ నే డైలాగ్ రైటర్. ప్ర‌స్తుతం వీర‌మ‌ల్లు చిత్రానికి మాటలు పూర్తి చేసే పనిలో ఉన్నారు.