ఓటమి భయంతోనే ఫోన్ ట్యాపరింగ్

కేంద్ర ప్రభుత్వం ఫోన్లను హ్యాక్‌ చేస్తోందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఇందిరా పార్కు వద్ద నిరసనకు దిగారు. ఓటమి భయంలోనే ప్రతిపక్షాలు, న్యాయమూర్తులు, మీడియా ప్రతినిధుల ఫోన్లను ప్రధాని ట్యాప్‌ చేయిస్తున్నారని టీ-కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ కూడా ఫోన్‌ ట్యాపింగ్‌ చేయిస్తున్నారన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ అంశంపై పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఫోన్ ట్యాపరింగ్ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ నేతల ధర్నా ఉద్రిక్తంగా మారింది. ఇందిరా పార్క్ వద్ద ధర్నా ముగిసిన తర్వాత ర్యాలీగా రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు నేతలు యత్నించారు. దీంతో కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్కను పోలీసులు అదుపులోకి తీసుకొని అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.