పరువుపోయింది.. పైసలు పోయాయ్ !

అశ్లీల చిత్రాలు నిర్మించి వివిధ యాప్‌ల ద్వారా వాటిని మార్కెట్ చేసుకుంటున్నార‌నే ఆరోప‌ణ‌ల‌పై శిల్పాశెట్టి భ‌ర్త‌, ప్ర‌ముఖ వ్యాపారి రాజ్‌కుంద్రాను గ‌త నెల 19న ముంబ‌యి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు శిల్పాశెట్టిని కూడా విచారించారు. ఈ కేసుకు, శిల్పాశెట్టికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులకు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.

త‌న భ‌ర్త అరెస్ట్‌, అనంత‌ర ప‌రిణామాల‌పై శిల్పాశెట్టి తొలిసారి స్పందించారు. సోమ‌వారం ట్విట‌ర్ వేదిక‌గా త‌న ఆవేద‌న‌ను శిల్పాశెట్టి పంచుకున్నారు. ‘గత కొన్నిరోజలుగా నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను. రాజ్‌కుంద్రా అరెస్ట్‌ వ్యవహరంపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మీడియాతోపాటు అయినవాళ్లు కూడా నన్ను, నా కుటుంబాన్ని నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారు.

ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటి వరకూ నేను అస్సలు మాట్లాడలేదు. ప్రస్తుతం కేసు విచారణలో దశలో ఉన్న కారణంగా ఆ విషయంపై నేను మాట్లాడాలని భావించ‌డం లేదు’ అన్నారు. పూర్తి వివ‌రాలు తెలుసుకోకుండా వార్త‌లు సృష్టించొద్ద‌ని ఆమె మీడియాకు హిత‌వు చెప్పారు.