భారీగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా ఉదృతి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు 40వేల పైనే ఉంటున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా మరో 42,618 మంది వైరస్‌ బారినపడ్డారు.ఇక మరణాలు కూడా 400 దిగువనే ఉన్నాయి. అయితే కొత్త కేసులు పెరుగుతుండటంతో దేశంలో క్రియాశీల కేసులు మళ్లీ 4లక్షలు దాటడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,618 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.29కోట్లు దాటింది. ఇదే సమయంలో 36,385 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.

ఇప్పటివరకు 3.21కోట్ల మంది కొవిడ్‌ను జయించగా.. రికవరీ రేటు 97.43శాతంగా ఉంది. నిన్న మరో 330 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. వైరస్‌ దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 4,40,225 మందిని బలితీసుకుంది. మరోవైపు కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసులు మళ్లీ 4లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,05,681 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 1.23శాతంగా ఉంది. కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న కేరళలో నిన్న కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అక్కడ 29,322 కొత్త కేసులు బయటపడగా.. 131 మరణాలు నమోదయ్యాయి.