బాక్సాఫీసుకి ఆక్సిజన్‌.. వాక్సినేషన్‌ పూర్తి !

కరోనా ఎన్ని వేవ్స్ వచ్చినా.. ప్రేక్షకులు తిరిగి థియేటర్స్ కి వచ్చేందుకు రెడీగా ఉన్నారని ‘సీటీమార్’ సినిమా నిరూపించింది. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్-తమన్నా జంటగా నటించిన సీటీమార్ వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్ టాక్ సొంతం చేసుకుంది. భారీ కలెక్షన్స్ రాబడుతోంది. హిట్ కిక్కులో ఉన్న దర్శకుడు సంపత్ నంది శనివారం మీడియాతో మాట్లాడారు. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

“చాలా రోజుల తర్వాత సి సెంటర్లలోనూ ప్రేక్షకులు థియేటర్లకి కదిలారు. ఇలాంటి మాస్‌ సినిమా చూసి చాలా కాలమైంది. పండగ రోజు ఒక పండగలాగే సినిమాని ఆస్వాదించారు. అందుకే మంచి ప్రారంభ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు… ఉత్తరాదిలోనూ షోలు పడ్డాయి. బాలీవుడ్‌ చిత్రాలతో పోలుస్తూ… వాటికంటే మంచి వసూళ్లు వచ్చాయని అంటున్నారు. చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్‌ చేసి… బాక్సాఫీసుకి ఆక్సిజన్‌ ఇచ్చారని, వాక్సినేషన్‌ పూర్తి చేసేశారని అంటున్నారు. చాలా ఆనందంగా ఉంది” అన్నారు.