ఫస్ట్ తేజు, సెకండ్ గోపీచంద్

కరోనా మహమ్మారి విజృభణతో సినీ పరిశ్రమలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఓటీటీల హవా మొదలైంది. ప్రేక్షకులు ఇంటినే థియేటర్ గా భావిస్తున్నారు. కొత్త సినిమాలని హాయిగా ఫ్యామిలీతో కలిసి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా, వెబ్ సిరీస్ లు.. ఇలా అరచేతిలోకి థియేటర్స్ వచ్చేశాయి. ఇలాంటి టైమ్ లో ప్రేక్షకుడిని తిరిగి థియేటర్స్ కి రప్పించడం, పూర్వ వైభవం తీసుకురావడం అంత ఈజీ విషయం కాదు. ఈ విషయంలో మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ సక్సెస్ అయ్యారు.

కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత రిలీజైన సాయిధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సూపర్ హిట్ అయింది. కరోనా భయాలని పక్కనపెట్టి ప్రేక్షకులు థియేటర్స్ వచ్చి ఈ సినిమాని ఎంజాయ్ చేశారు. ఇక సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ వచ్చిన చిత్రాల్లో తొలి హిట్ యాక్షన్ హీరో గోపీచంద్ ఖాతాలో పడింది. సంపత్ నంది దర్శకత్వంలో ఆయన నటించిన సీటీమార్ చిత్రం వినాయక చవితి కానుకగా థియేటర్స్ లోకి వచ్చింది. మంచి టాక్ రావడంతో.. ప్రేక్షకులు థియేటర్స్ వైపు పరుగులు పెడుతున్నారు. ఈ లెక్కన కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ తర్వాత హిట్ కొట్టిన హీరోలుగా తేజు, గోపీచంద్ నిలిచారు.