గుడ్ న్యూస్ : తేజు కోలుకుంటున్నాడు

మెగా యంగ్ హీరో సాయిధరమ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి స్పోర్ట్స్ బైక్ వెళ్తున్న తేజు ప్రమాదానికి గురయ్యాడు. అప్పటి నుంచి అపస్మారకస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ అపోలో హాస్పటల్ లో వెంటిలేటర్ పై తేజుకి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం కాలర్‌ బోన్‌ సర్జరీ కూడా చేశారు. అది విజయవంతం అయింది. సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. తేజ్ కు వెంటిలేటర్ అవసరం క్రమంగా తగ్గుతోందని వివరించారు.

ప్రమాదం ఎలా జరిగింది ?

శుక్రవారం రాత్రి 8:30 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. తేజు ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో స్కిడ్ అయింది. బైక్ తో పాటు తేజు పల్టీలు కొడుతూ కొంత దూరం కొట్టుకుపోవడం పోలీసులు విడుదల చేసిన సీసీ పుటేజ్ లో కనిపించింది. పక్కటెముకలకు బలంగా దెబ్బలు తాకడంతో.. ప్రమాదం జరిగిన వెంటనే తేజు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మొదట అతడిని మెడికవర్ హాస్పటల్ లో చేర్పించి ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత అపోలో హాస్పటల్ కి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో తేజు హెల్మెంట్ పెట్టుకున్నారు. దీంతో.. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రాణాలు కాపాడుకోగలిగారు. బ్రెయిన్ స్కాన్ లో నార్మల్ వచ్చింది. కాలర్‌ బోన్‌ సర్జరీ అవసరమైతే.. దాన్ని డాక్టర్లు విజయవంతం పూర్తి చేశారు.