రైతులకు కేసీఆర్ షాక్.. ఇకపై వరి వద్దు !

ఎడారి తెలంగాణలో ఏరులు పారుతున్నయ్. కరువు తెలంగాణలో కరువు తీరింది. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల ఫలాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయి. ఊరువాడ చెరువులు, కుంటలు నిండితున్నయి. దీంతో రైతులు సంతోషంగా సాగు చేసుకుంటున్నరు. వరినాట్లు వేసుకుంటున్నరు. ఫలితంగా దేశంలోనే అత్యధిక వరి ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించింది. ఇలాంటి టైమ్ లో సీఎం కేసీఆర్ రైతులకి షాక్ ఇచ్చారు. ఇకపై వరి వద్దు అని చెప్పేశారు.

ఆదివారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇక వచ్చే యాసంగి నుంచి వరి వేయడమంటే, రైతులు ఉరి వేసుకోవడమేననే వ్యక్తమైంది. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలైన శనగలు, వేరుసెనగలు, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు, ఆముదాలు, కూరగాయల లాంటివి పండిస్తే రైతులకు లాభాలు వస్తాయని సమావేశం అభిప్రాయపడింది. ప్రస్తుత వానాకాలంలో 60 లక్షల టన్నులకు మించి ధాన్యం తీసుకోబోమని కేంద్రం నిర్మొహమాటంగా చెప్పినందున, ధాన్యాన్ని ప్రభుత్వం గానీ, మిల్లర్లు గానీ కొనుగోలు చేయడానికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు రానున్నాయని తెలిపింది.