ఢిల్లీ టాప్ లేపేసింది

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్-14 పార్టు 2లో ఢిల్లీ జట్టు టాప్ లేపిసేసింది. ఆల్‌రౌండ్‌ సత్తా చాటుతూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించింది. ఏడో విజయంతో దిల్లీ ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. ఇక ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడో ఓటమి చవిచూసిన సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఆ జట్టు ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లే.

బుధవారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించింది. రబాడ (3/37), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నార్జ్‌ (2/12), అక్షర్‌ పటేల్‌ (2/21) ధాటికి మొదట సన్‌రైజర్స్‌ 9 వికెట్లకు 134 పరుగులే చేయగలిగింది. 28 పరుగులు చేసిన సమద్‌ టాప్‌ స్కోరర్‌. ధావన్‌ (42; 37 బంతుల్లో 6×4, 1×6), శ్రేయస్‌ అయ్యర్‌ (47 నాటౌట్‌; 41 బంతుల్లో 2×4, 2×6), కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (35 నాటౌట్‌; 21 బంతుల్లో 3×4, 2×6) మెరవడంతో లక్ష్యాన్ని దిల్లీ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇప్పటివరకు ఒకే మ్యాచ్‌లో నెగ్గిన సన్‌రైజర్స్‌.. ప్లేఆఫ్స్‌ రేసులో ఉండాలంటే మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి.