మా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వివాదం

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వివాదం తెరపైకి వచ్చింది. మంచు విష్ణు అడ్డదారిలో గెలిచేందుకు ప్రయత్నిస్తుందని ప్రకాష్ రాజ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మా అసోసియేషన్ ఎన్నికల్లో 60యేళ్లు దాటిన నటీనటులకు పోస్టల్ బ్యాలెట్ లో ఓటు హక్కుని వినియోగించుకొనే అవకాశం ఉంది. 

ఈ నేపథ్యంలో విష్ణు ప్యానల్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లని ముందు ముందే వేయించుకుంటున్నారు. వారితో సంతకాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 60 మందితో సంతకాలు పెట్టించి పోస్టల్ బ్యాలెట్ లని రెడీ చేసుకున్నారని ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఈ లిస్టులో సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, పరుచూరి బ్రదర్స్ తదితరులు ఉన్నారని.. అడ్డదారిలో గెలిచేందుకు విష్ణు ప్యానల్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. దీనిపై సినీ పెద్దలు స్పందించాలన్నారు. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 10న మా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.