రవిశాస్త్రి తర్వాత కోచ్‌గా ద్రవిడ్‌

రెండో పర్యాయం టీమిండియా కోచ్‌గా కొనసాగుతున్న రవిశాస్త్రి పదవీకాలం నవంబరు 14తో ముగియనుంది. దీంతో కొత్త కోచ్‌ని ఎంపిక చేయడానికి బీసీసీఐ కసరత్తు ప్రారంభించింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్‌ మూడీ, భారత మాజీ కెప్టెన్‌ అనిల్ కుంబ్లే, వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి తర్వాత కోచ్‌గా ఎవరు ఉంటే బాగుంటుందనే అంశంపై పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.

ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, సెలెక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ కూడా ఈ అంశంపై స్పందించారు. రవిశాస్త్రి తర్వాత హెడ్‌ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్, మెంటార్‌గా టీమ్ఇండియా మాజీ సారథి ఎం.ఎస్.ధోనీ ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ద్రవిడ్ ఇప్పటికే కోచ్‌గా నిరూపించుకున్నాడు. ఆయన శిక్షణలోనే 2018లో టీమ్‌ఇండియా అండర్‌-19 ప్రపంచ కప్‌ని సాధించింది. ఇండియా-ఏ జట్టుకు కూడా కోచ్‌గా వ్యవహరించి అనేక విజయాలనందించాడు.