శ్రీవారి సేవలో మంచు విష్ణు

 ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు తన తండ్రి మోహన్‌బాబు, ప్యానెల్‌ సభ్యులతో కలిసి ఆయన సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించి.. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నికల్లో నా ప్యానెల్‌ ఎంతో కష్టపడింది. స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అసోసియేషన్‌ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తాను.

ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు రాజీనామాలు చేశారని.. మీడియా ద్వారానే తెలిసింది. వాళ్ల రాజీనామా లేఖలు ఇంకా మాకు అందలేదు. రాజీనామా లేఖలు అందాక ఆ విషయంపై స్పందిస్తాను’నని విష్ణు అన్నారు. అక్టోబర్‌ 10న జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు తమ పదవులకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.