ఈటల-రేవంత్.. సీక్రెట్ మీటింగ్ !

హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కోసం తెలంగాణ కాంగ్రెస్ సహకరిస్తోంది. అందుకే డమ్మీ అభ్యర్థిని బరిలోకి దించిందని మంత్రి కేటీఆర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సంచలన ఆరోపణ చేశారు కేటీఆర్. కాంగ్రెస్‌ నేతలతో ఈటల కుమ్మక్కయ్యారని విమర్శించారు. హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో ఈటల, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ కలుసుకున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. వారి భేటీ వెనక మతలబేంటని ప్రశ్నించారు.

ఈటల, రేవంత్‌ కలిశారో లేదో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. వారిరువురూ కలిసినట్లు ఉన్న ఆధారాలు బయటపెడతాం అని అన్నారు. ఎన్నికల సంఘం పరిధి దాటి వ్యవహరిస్తోందని తెలిపారు. హుజూరాబాద్‌లో తెరాసను నిలువరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్, భాజపా ఉమ్మడి అభ్యర్థిగా ఈటల కొనసాగుతున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. అందుకే కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని విమర్శించారు.