‘సౌండ్‌ ఆఫ్‌ భీమ్లానాయక్‌’ వచ్చేసింది

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమ్లానాయక్‌’. రానా దగ్గుబాటి మరో కథానాయకుడు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. రానాకు జోడీగా సంయుక్త మేనన్‌.. పవన్‌కు జోడీగా నిత్యామేనన్‌ సందడి చేయనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తాజాగా భీమ్లా నాయక్  సర్‌ప్రైజ్‌ బయటకు వచ్చింది. 

‘సౌండ్‌ ఆఫ్‌ భీమ్లానాయక్‌’ పేరుతో మూడో పాటను విడుదల చేశారు. ‘లాలా భీమ్లా.. అడవి పులి.. గొడవపడి’ అంటూ సాగే పాట సినిమాలో పవన్‌కల్యాణ్‌ పాత్రను తెలియజేసేలా రూపొందించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ పాటను రచించారు. సెన్సేషనల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ స్వరాలు అందించగా అరుణ్ కౌండిన్య పాటను మరింత పవర్‌ఫుల్‌గా ఆలపించారు. విడుదల చేసిన కొన్ని క్షణాల్లోనే ఈ పాట ఫుల్‌ క్రేజ్‌ సొంతం చేసుకుని యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. అత్యధిక వేగంగా లక్ష లైక్స్ సాధించిన పాటగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం 9 నిమిషాల్లో లక్ష లైకులని సొంతం చేసుకుంది.