రాజకీయ లబ్ధి కోసమే ఉద్యోగుల చీలిక

సీనియర్, జూనియర్ పేరుతో ఉద్యోగుల్లో చీలిక తెచ్చి రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ ఆరోపించారు. స్థానికులైన ఉద్యోగులు జోనల్ విధానంతో ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 317తో ఉద్యోగుల స్థానికతకు పెను ప్రమాదం ఏర్పడిందన్నారు. పాత సమస్యను దారి మళ్లించేందుకు ఎప్పటికప్పుడు కొత్త సమస్యను తెరమీదకు తెస్తూ రాజకీయ పబ్బం గడపుకోవడం సీఎంకు అలవాటుగా మారిందని బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. ఈ జీవోను తక్షణమే నిలిపేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్న తర్వాతే జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు జరపాలని కోరారు.