రాధేశ్యామ్ కోసం జాతిరత్నం

ప్రభాస్ రాధేశ్యామ్ కు కొత్తగా ప్రయత్నిస్తున్నారు. రాధేశ్యామ్ ట్రైలర్ లాంచ్ కోసం యాంకర్ గా సుమని తీసుకోలేదు. మన టాలీవుడ్ ‘జాతిరత్నం’ నవీన్ పోలిశెట్టిని హోస్ట్ గా తీసుకువచ్చారు. ప్రభాస్ తో, యువి బ్యానర్ తో వున్న అనుబంధంతో దీనికి ఓకె అన్నాడు నవీన్. ప్రతీ సినీ ఫంక్షన్ కి సుమనే యాంకరింగ్ చేయడం వలన ప్రేక్షకులు బోర్ గా ఫీలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలా కొత్తగా, క్రేజీగా ట్రయ్ చేస్తున్నారు. రెగ్యులర్ గా సుమ మార్క్ పంచ్ లు, మాటలు వింటూ కార్యక్రమం కానిచ్చేయాల్సిందే. ఇప్పుడు ఆమె స్థానంలో జాతిరత్నం కనిపించబోతున్నారు. ఇప్పటికే నవీన్ ప్రాక్టీసు మొదలెట్తినట్టు తెలుస్తోంది.

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ తెరకెక్కింది. ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే నటించింది. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రమిది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ ఆకట్టుకున్నాయి. పరమహంస పాత్రలో సీనియర్ రెబల్ స్టార్ కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకంతే వారం ముందే జనవరి 7న ఆర్ ఆర్ ఆర్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి వస్తున్న ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయనున్నాయి.