బాలీవుడ్ లో బన్నీ సెంచరీ

వందకోట్ల సినిమాని టాలీవుడ్ లో ఘనంగా, గర్వంగా చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు వందకోట్లు తెలుగు సినిమాకు చాలా తక్కువ అనిపిస్తుంది. టాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటుతుంది.

బాహుబలి, సాహో సినిమాల తర్వాత బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా నచ్చిన సినిమాగా ‘పుష్ప’ నిలిచింది. గత యేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకుకొచ్చిన ‘పుష్ప’ విడుదలైన ప్రతిచోటా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబడుతోంది.

బాలీవుడ్ లో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా.. ఇప్పటికే పుష్ప కలెక్షన్స్ రూ. 60కోట్లు దాటేశాయి. రూ. 75కోట్ల వైపు దూసుకెళ్తున్నాయి. అంతేకాదు.. రూ. 100కోట్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. పుష్పరాజ్ గా బన్నీ నటన, సుకుమార్ టేకింగ్ కు బాలీవుడ్ జనాలు ఫిదా అవుతున్నారు. ఇక మొత్తంగా పుష్ప కలెక్షన్స్ రూ. 300కోట్లు దాటిపోయాయి. 

సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’. ముందుగా సింగిల్ స్కిప్ట్, కేవలం తెలుగు సినిమానే అనుకున్న పుష్ప.. ఆ తర్వాత రెండు పార్టులు, పాన్ ఇండియా సినిమా టర్న్ తీసుకుంది. సినిమాలో బన్నీకి జంటగా రష్మిక మందన నటించారు. స్టార్ హీరోయిన్ సమంత ఐటమ్ సాంగ్ లో మెరిసింది. మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ నిర్మించింది.