సడెన్ షాక్ : టెస్ట్ కెప్టెన్సీ నుంచి కోహ్లీ అవుట్

కెప్టెన్ గా విరాట్ కోహ్లీ శకం ముగిసింది. టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు కోహ్లీ ప్రకటన చేశారు. దీంతో అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీ వైదొలిగినట్లు అయింది. ఇప్పటికే టీ20 కెప్టెన్సీ వదిలేసిన కోహ్లీని వన్డే నాయకత్వం నుంచి బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే. విరాట్ స్థానంలో రోహిత్‌శర్మను కెప్టెన్‌గా నియమించింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ఓడిపోవడంతో విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెబుతున్నట్టు విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ చిన్న నోట్ ని పోస్ట్ చేశారు. “దాదాపు ఏడేళ్లపాటు సారథిగా జట్టును సరైన మార్గంలో నడిపించేందుకు కృషి చేశా. బాధ్యతలను ఎంతో నిబద్ధతతో నిర్వర్తించా. ప్రతి దానికి ముగింపు అనేది ఉంటుంది. అది నా టెస్టు కెప్టెన్సీకి కూడానూ. ఇప్పటి వరకు సాగిన ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలను అనుభవించా. అయితే కృషి, నమ్మకం లేకుండా ఏ రోజూ ఆడలేదు.

విజయం కోసం 120 శాతం కృషి చేశానని బలంగా నమ్ముతున్నా. జట్టు కోసం హృదయ పూర్వకంగా పనిచేశా. ఈ సందర్భంగా బీసీసీఐ, రవిశాస్త్రి, ఎంఎస్ ధోనీకి ధన్యవాదాలు చెప్పాలి. మరీ ముఖ్యంగా కెప్టెన్సీ విషయంలో నా మీద నమ్మకం ఉంచిన ఎంఎస్ ధోనీకి కృతజ్ఞతలు” అని విరాట్ పేర్కొన్నాడు.