‘భీమ్లా నాయక్’ ఆడవాళ్లను గౌరవిస్తాడా ?

ఫిబ్రవరి 25 – ‘భీమ్లా నాయక్’ కోసం బుక్ అయిపోయింది. సంక్రాంతి బరిలో ఉన్న భీమ్లా నాయక్ ను బుజ్జగించి.. ఈ డేటుకి మార్చిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో ఉన్నరెండు పాన్ ఇండియా సినిమాలు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ కోసం ఈ పని చేశారు. ఆ తర్వాత కరోనా ఎఫెక్ట్ తో సంక్రాంతి బరిలో ఉన్న రెండు సినిమాలు కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడుతుంది. అనడం కంటే కరోనా భయం పోతుంది. అతి త్వరలోనే తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేలా కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించేందుకు సినిమాలు త్వర పడుతున్నాయి. శర్వానంద్-రష్మిక మందన జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఆడవాళ్లు మీకు జోహార్లు ఫిబ్రవరి 25న రిలీజ్ డేట్ ప్రకటించుకుంది. కానీ ఓ కండిషన్ అప్లై అంటున్నారు. ఈ డేటున భీమ్లా నాయక్ వస్తానంటే.. ఆడవాళ్లు సైడైపోవడానికి రెడీగా ఉన్నారట. లేదంటే మాత్రం అదే డేటు ఫిక్స్ అంటున్నారు. ఆడవాళ్లకు గౌరవం ఇచ్చి భీమ్లా నాయక్ మరో డేటు చేసుకుంటాడా ? లేక ఆడవాళ్లను వేరే డేటుని రమ్మంటారా ? అన్నది చూడాలి.