యూపీ బీజేపీకి చెరకు రైతుల సెగ

ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల జాబితాలో దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. యూపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా ? అన్నది ఆసక్తిగా అని దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. వాస్తవానికి యూపీలో ఏ పార్టీ అధికారంలో ఉంటే… ఆ పార్టీ పార్లమెంట్‌లో చక్రం తిప్పుతుందనేది అన్ని పార్టీల నమ్మకం. అందుకే… యూపీలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని గద్దె దింపేందుకు ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంటే… సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇతర ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన కూడా దాదాపు పూర్తి అయ్యింది. అయితే మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ నేతలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. జాతీయ స్థాయి నేతలంతా ఇప్పటికే యూపీలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే యూపీలో బీజేపీకి రైతుల దెబ్బ గట్టిగా పడేలా కనిపిస్తుంది. చెరకు రైతులు యోగీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చెరుకు రైతులకు యోగీ సర్కార్ చెల్లించాల్సిన బకాయిల అంశం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.

ఐదేళ్ల కాలంలో పశ్చిమ యూపీలో ఉన్న 119 చెరుకు మిల్లులు కూడా రైతుల నుంచి ఏకంగా 465 లక్షల టన్నుల చెరుకును కొనుగోలు చేశాయి. అయితే దీనికి చెల్లింపులు మాత్రం జరగలేదు. ఇవి ఇప్పటికే వేల కోట్ల రూపాయిల బకాయిలుగా మారిపోయాయి. దీంతో… చెరుకు రైతులు యోగీ సర్కార్ పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల్లో కమలం పార్టీకి బుద్ధి చెప్పాలని కంకణం కట్టుకున్నారు.