వేడ్.. అన్ హ్యాపీ

ఐపీఎల్-2022 ఫైనల్ కు చేరింది. ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో గుజరాత్, రాజస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. అరంగేట్ర సీజన్‌లోనే మేటి జట్లను మట్టికరిపించి ఏకంగా ఫైనల్‌కు చేరి అందరిని ఆశ్చర్యపరిచింది గుజరాత్‌ జట్టు. అయితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు ఫైనల్ కు చేరినా.. ఆ జట్టు ఆటగాడు మాథ్యూ వేడ్ హ్యాపీగా లేడట. బ్యాటింగ్‌ సరిగా చేయకపోవడమే అందుకు ప్రధాన కారణం చెప్పుకొచ్చాడు.

“మంచి షాట్లతో ఇన్నింగ్స్‌ను ఆరంభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నా. టీ20 క్రికెట్‌లో దూకుడుగా ఆడితేనే కలిసొస్తుంది. ఆ ప్లాన్‌లో నేను విఫలమయ్యా. కీలకమైన ఫైనల్‌కు ముందు కాస్త మంచి బ్యాటింగ్‌ చేయడం ఆనందం కలిగించింది. ఒక ఆటగాడిగా విఫలమైనప్పుడు కెప్టెన్‌ మద్దతు ఉండాలి. ఆ విషయంలో హార్దిక్‌ నుంచి నాకు మంచి సపోర్ట్‌ ఉంది. తొలి స్థానం నుంచి ఏడో స్థానం వరకు మా జట్టులో బ్యాటింగ్‌ చేసే సత్తా ఉంది. రషీద్‌ ఖాన్‌ రూపంలో ఏడో నెంబర్‌ వరకు విధ్వంసకర బ్యాటింగ్‌ మాకు ఉండటం అదృష్టం. ఈసారి కప్‌ గుజరాత్‌దే” అని మాథ్యూ వేడ్‌ అన్నాడు.