మల్లారెడ్డి హత్యకు రేవంత్ రెడ్డి కుట్ర

మంత్రి మల్లారెడ్డికి ఆదివారం ఘోర అవమానం జరిగిన సంగతి తెలిసిందే. ‘రెడ్ల సింహగర్జన’ సభలో ఆయనపై దాడి జరిగింది. మంత్రి ప్రసంగిస్తుండగా కొందరు కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం మంత్రి వేదిక దిగి వెళ్లిపోతుండగా, వెంబడించి.. ఆయన వాహనశ్రేణిపై కుర్చీలు, చెప్పులు విసిరారు. అప్రమత్తతతో వ్యవహరించిన పోలీసులు ఆయనను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుట్ర అంటూ మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు.

 తనను హత్య చేసేందుకు ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెరాస సంక్షేమ పథకాలు రెడ్లకు అందుతున్నాయని సభలో చెప్పానన్నారు. తనను ఎనిమిదేళ్లుగా బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డి నేరాలపై విచారణ చేసి జైలులో పెడతామన్నారు. తనపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మల్లారెడ్డి చెప్పారు.