పిచ్చెక్కిచ్చేద్దాం.. బ్రో !

పిచ్చెక్కిచ్చేద్దాం.. బ్రో అంటున్నాడు రానా దగ్గుబాటి. వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. ఈ క్రమంలో ఆయన చేసిన విరాటపర్వం ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రానా.. ఇకపై ప్రయోగాలు చేయనని ప్రకటించాడు. ఇన్నాళ్లూ తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేశానని, ఇకపై ఫ్యాన్స్ కు నచ్చే సినిమాలు మాత్రమే చేస్తానని ప్రకటించాడు.

‘విక్టరీ వెంకటేష్ అభిమానులే నాక్కూడా ఉంటారనుకున్నాను. నాకంటూ ఫ్యాన్స్ ఉంటారని అనుకోలేదు. నాకేవో కథలు నచ్చాయి, కొత్త కథలతో ఏవో సినిమాలు చేసుకుంటూ వెళ్లాను. కానీ ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అర్థమైంది. విరాటపర్వం లాంటి సినిమాలు చేయొద్దని నాకు చెబుతున్నారు. ఓ నటుడిగా ఇదే నా చివరి ప్రయోగం. ఇకపై ఫ్యాన్స్ కోసమే సినిమాలు చేస్తాను. పిచ్చెక్కిచ్చేద్దాం’ అంటూ ఫ్యాన్స్ ను ఖుషి చేశారు రానా.