అండర్ కవర్ ఆపరేషన్ @పబ్స్

ఇటీవల పబ్‌లలో తరచూ వివాదాస్పద కార్యకలాపాలు చోటుచేసుకోవడంతో ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు.  స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌) ఆధ్వర్యంలో నాలుగు బృందాలు కొద్దిరోజులుగా అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ చేపడుతున్నాయి. నిత్యం పబ్‌లలోకి వెళ్తూ అక్కడి కార్యకలాపాలపై దృష్టి పెడుతున్నాయి. 

‘పాసివ్‌ అబ్జర్వేషన్‌’గా పరిగణించే ఈ అండర్‌కవర్‌ ఆపరేషన్లలో భాగంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో 35, హైదరాబాద్‌ పరిధిలో 17 పబ్‌లను గుర్తించి తనిఖీలు నిర్వహించాయి. వాటిలో మాదకద్రవ్యాల సరఫరా జరుగుతోందా..? మైనర్లను అనుమతిస్తున్నారా..? శబ్దకాలుష్యంతో పరిసర ప్రాంతాలవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా..? వంటి అంశాలపై ఆరా తీశాయి. ముఖ్యంగా బండ్లగూడ సన్‌సిటీ, గోల్కొండ, మెహిదీపట్నం.. లాంటి ప్రాంతాల్లో నేరచరిత్ర కలిగిన నైజీరియన్ల కదలికలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు ఎస్టీఎఫ్‌ వర్గాలు తెలిపాయి.