టీఆర్ఎస్‌కు మరో అస్త్రం

కేంద్రంపై పోరాడేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా గెలవడని తెలిసినా.. ఆయన హైదరాబాద్ కు వస్తే.. ఘన స్వాగతం పలికింది. ఆ రోజు హైదరాబాద్ మోడీ సభకు ధీటుగా స్వాతగ ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేసింది. ఒకరకంగా ఇది.. టీఆర్ఎస్ తన బలాన్ని హైదరాబాద్ కు వచ్చిన ప్రధాని మోడీ, కేంద్రం పెద్దలు చూపించుకోవాలనే తాపత్రయమే. దాని ఫలితం ఎలా ఉన్నా.. ఇప్పుడు గులాబి పార్టీకి మరో అస్త్రం దొరికింది. చాలా కాలంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా అడుగుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇంత కాలం ఎలాంటి సమాధానం చెప్పలేదు. 

హఠాత్తుగా ఇప్పుడు పార్లమెంట్‌లో మాత్రం కాళేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చే ప్రశ్నే లేదని తేల్చేసింది. ఏదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటే కొన్ని ప్రమాణాలు ఉంటాయని అలాంటి ప్రమాణాలను కాళేశ్వరం అందుకోలేదని కేంద్రం తెలిపింది. ప్రతి రాష్ట్రానికి ఓ జాతీయ హోదా ఉన్న ప్రాజెక్ట్ ప్రకటించడం సంప్రదాయం. కానీ తెలంగాణకు మాత్రం ఎలాంటి జాతీయ ప్రాజెక్టు ప్రకటించలేదు. దీనిపై టీఆర్ ఎస్ ప్రభుత్వం గట్టిగా పోరాడే అవకాశం ఉంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాళేశ్వరం మోటర్లు మునిగిపోవడం ఒక్కటే కారు పార్టీని కలవరపెడుతుంది. లేదంటే.. ఈ అవకాశాన్ని ఓ రేంజ్ లో వాడుకునేదే. ఢిల్లీ.. గల్లీలో గత్తెరలేపేదే.. !