విండీస్ పై టీమిండియా గొప్ప రికార్డు

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలోనూ టీమ్‌ఇండియా అద్భుత విజయం సాధించింది. చివర్లో అక్షర్‌ పటేల్‌ (64 నాటౌట్‌; 35 బంతుల్లో 3×4, 5×6) దంచికొట్టడంతో భారత్‌ ఈ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించడమే కాకుండా 2-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

12 పరుగుల భారీ ఛేదనలో శుభ్‌మన్‌ గిల్‌ (43; 49 బంతుల్లో 5×4), శ్రేయస్‌ అయ్యర్‌ (63; 71 బంతుల్లో 4×4, 1×6), సంజూ శాంసన్‌ (54; 51 బంతుల్లో 3×4, 3×6), దీపక్‌ హుడా (33; 36 బంతుల్లో 2×4) తలా ఓ చేయి వేశారు. అయితే, ఆఖరి పది ఓవర్లలో జట్టు విజయానికి 100 పరుగులు అవసరమైన వేళ అక్షర్‌ రెచ్చిపోయాడు. టెయిలెండర్లతో కలిసి ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో తన తొలి అర్ధ శతకం సాధించాడు. దీంతో అతడికి ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

దీంతో భారత జట్టు విండీస్‌పై అద్వితీయమైన రికార్డు నమోదు చేసింది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మరే జట్టుకు సాధ్యంకాని రీతిలో వరుసగా 12 సిరీస్‌లు కైవసం చేసుకొని ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. గతంలో టీమ్‌ఇండియా.. పాకిస్థాన్‌తో సమానంగా 11 వరుస ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచింది. దాయాది జట్టు జింబాబ్వేపై 1996 నుంచి 2021 వరకు వరుసగా 11 సిరీస్‌లు సొంతం చేసుకుంది. ఇప్పుడు టీమ్‌ఇండియా దాన్ని అధిగమించింది.