షూటింగ్స్ బంద్.. కుదరని ఏకాభిప్రాయం

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరిగింది. సినిమా షూటింగ్‌ల నిలుపుదల, టికెట్‌ ధరలపై కూలంకషంగా చర్చించారు. అయితే షూటింగ్స్ బంద్ విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది. సమావేశం అనంతరం నిర్మాత సి. కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.

తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఆయన తెలిపారు. సినిమా రంగ సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈనెల 27న కమిటీ భేటీ అవుతుందని తెలిపారు. స్పెషల్‌ కమిటీలో ఎవరెవరు ఉండాలి? ఏ విభాగాల నుంచి ఎంతమందిని తీసుకోవాలి? ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి?అనే విషయాలను చర్చించామని చెప్పారు.