కారు దిగిన ఎర్రబెల్లి ప్రదీప్‌రావు

టీఆర్ఎస్ పార్టీకి మరో నేత గుడ్ చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, వరంగల్‌ అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు  టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. 2018 ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నుంచి ఎమ్మెల్యే టికెట్, తర్వాత ఎమ్మెల్సీ పదవి ఆశించి భంగపడిన ప్రదీప్‌రావు.. అప్పటి నుంచి పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా కారు దిగి.. తన దారి తాను చూసుకుంటున్నారు.

ఆదివారం వరంగల్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రదీప్ రావు మాట్లాడారు. ‘పార్టీలో చేరినప్పటి నుంచి ఎన్నో అవమానాలు పడ్డాను. అన్నీ సహించి ఇన్నాళ్లూ కొనసాగాను. నాకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలేదు. మ కార్యకర్తలకు తెరాస ఏమీ చేయలేదు. బంగారు తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేశా. స్థానిక ఎమ్మెల్యే అవమానపరిచేలా మాట్లాడారు. పార్టీలో ఉండగానే ఎమ్మెల్యే మమ్మల్ని తిట్టారు. ఆయన తిట్టినా తెరాస నాయకులు ఎవరూ దాన్ని ఖండించలేదు. ఏ పార్టీ ఆదరిస్తే ఆ పార్టీకి వెళ్తా.. లేదంటే స్వతంత్రంగా ఉంటా’నన్నారు. అయితే ప్రదీప్ రావు త్వరలోనే బీజేపీలోచేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.