పూరి అప్పులు తీర్చిన విజయ్

లైగర్ సినిమాతో దర్శకుడు పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ల మధ్య బంధం బలపడింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. వీరి కాంబోలో రెండో సినిమాగా ‘జనగణమన’ తెరకెక్కుతోంది. మరోవైపు హ్యాట్రిక్ సినిమా కూడా రంగం సిద్ధమైనట్టు సమాచారం.

వరంగల్‌లో నిర్వహించిన ‘లైగర్‌’ ఫ్యాన్‌డమ్‌ మీట్‌లో పాల్గొన్న పూరీ.. విజయ్‌ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భార్య లావణ్య చెప్పడం వల్లే ‘అర్జున్‌రెడ్డి’ వీక్షించానని.. ఆ సినిమా చూస్తున్నప్పుడే విజయ్‌తో సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయానని చెప్పుకొచ్చారు.

ఇక ‘లైగర్‌’లో ఏ సీన్‌ చూసినా..  ఎక్కడా విజయ్‌ నటనలో పొగరు కనిపించదు. కేవలం నిజాయతీ మాత్రమే కనిపిస్తుంది. విజయ్‌ రియల్‌ లైఫ్‌లోనూ హీరోనే. ఒక నిర్మాతగా అతడికి ఓసారి రూ.కోటి పంపిస్తే.. ‘నాకు ఇప్పుడే వద్దు ఈ డబ్బుని ముందు సినిమా కోసం ఖర్చుపెట్టండి. నేను తర్వాత తీసుకుంటా’ అని చెప్పాడు. ఆ తర్వాత మరోసారి రూ.రెండు కోట్లు పంపిస్తే నాకు అప్పులున్నాయని తెలుసుకుని.. ‘ఈ డబ్బుతో మీరు ముందు అప్పులు తీర్చేయండి’ అని ఆ డబ్బుని వెనక్కి పంపించేశాడు పూరి తెలిపారు. ఈ లెక్కన పూరి అప్పులను విజయ్ తీర్చినట్టేనని అభిమానులు చెప్పుకుంటున్నరు.