అమిత్ షాకు షాక్ ఇచ్చిన తెలంగాణ రైతులు

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరికొద్దిసేపట్లో మునుగోడు చేరుకోనున్నారు. మునుగోడులో బీజేపీ నిర్వహిస్తున్న సమరభేరి సభలో పాల్గొననున్నారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయంలో దిగిన అమిత్ షాకు ఘన స్వాగతం లభించింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు ముఖ్యనేతలు దగ్గరుండి రిసీవ్ చేసుకున్నారు.

దరాబాద్ లో అడుగుపెట్టగానే తెలంగాణ రైతులతో షా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ చట్టాలను వెనక్కి తీసుకోమని రైతులు అమిత్ షా ను కోరారు. అయితే మార్చాల్సింది చట్టాలను కాదు.. కేసీఆర్ సర్కార్ ను అని షా బదులిచ్చినట్టు తెలుస్తోంది. మోటర్లకు మీటర్లు అంటూ నిన్నటి సభలో సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వాటిపై నేటి సభలో అమిత్ షా రియాక్షన్ ఎలా ఉండనుంది ? అన్నది చూడాలి.

ఇక రైతులతో భేటీ అనంతరం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి అమిత్‌షా వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం సాంబమూర్తినగర్‌లో భాజపా కార్యకర్త సత్యనారాయణ ఇంటికి ఆయన వెళ్లారు. అమిత్‌షా పర్యటన నేపథ్యంలో ఉజ్జయిని మహంకాళి పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమిత్‌షా హైదరాబాద్‌లో కార్యక్రమాలను ముగించుకుని మునుగోడు బయలుదేరారు.