తెలంగాణను చెప్పు చేతల్లో పెట్టుకోలేరు

ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పులు .. బండి సంజయ్ మోయడం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీల నేతలు బండి సంజయ్ బానిసత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తెలుగు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని ఫైర్ అవుతున్నారు. ఢిల్లీ నేతల చెప్పు చేతల్లో తెలంగాన బందీ అంటూ ఘూటుగా విమర్శలు చేస్తున్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు.

“ఆత్మాభిమానంలేని కొందరు తొత్తులు మీ చెప్పులు మోయొచ్చుగానీ.. తెలంగాణను చెప్పు చేతల్లో పెట్టుకోవాలని మీరు చేస్తున్న కుట్రలకు ఆత్మగౌరవం వున్న తెలంగాణ జాతి ఎప్పుడూ లొంగదనే విషయాన్ని గుర్తుంచుకోండి.” అని కేటీఆర్ అన్నారు. బీజేపీ నేతల మాటలను ఎవరూ నమ్మరు. తెలంగాణ కర్షకుడి మీద కక్షగట్టింది నిజం కాదా..? మోటర్లకు మీటర్లు పెట్టి .. ఉచిత కరెంట్ ను కబళించే కుట్రలు చేస్తున్నది మీరు కాదా..? కృష్ణా జలాల్లో వాటాలు తేల్చకుండా నికృష్ణ రాజకీయం చేస్తున్నది మీరు కాదా..? అంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు.