టీఆర్ఎస్ బీజేపీలో విలీనం ?

టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన సంగతి తెలిసిందే. జాతీయ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ముందుగా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలను టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆ తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాలకు బీఆర్ఎస్ ను విస్తరిస్తాం. బీజేపీ, కాంగ్రెస్ యేతర శక్తిగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ చెబుతున్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో రాజకీయ చేయడం మాట అటుంచితే.. టీఆర్ఎస్ కు ఉన్న ఎంపీలో బీజేపీలో చేరబోతున్నారు. ఆ పార్టీకి చెందిన ఐదుగురు రాజ్యసభలో త్వరలో కమలతీర్థం పుచ్చుకోనున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బాంబు పేల్చారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని.. ప్రగతి భవన్ లో ఉండి ప్రగతి సాధించిన హ్యాపీ రావు నేతృత్వంలో అది జరగనుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

హ్యాపీ రావు అంటే ఎంపీ సంతోష్ రావు. ఆయన ఇటీవల ప్రగతి భవన్ నుంచి బయటికొచ్చారు అనే ప్రచారం జరుగుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నేపథ్యంలో సంతోష్ రావుపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి ఆయన అలిగి ప్రగతి భవన్ గేటు దాటారు. నాలుగురోజులుగా ఫోన్ కూడా తీయడం లేదని మీడియాలో కథనాలు వినిపించాయి. ఇప్పుడు సంతోష్ రావు టీఆర్ ఎస్ రెబల్ గా మారారు. బీజేపీతో చేతులు కలిపారు. ఏకంగా టీఆర్ ఎస్ రాజ్యసభ పక్షాన్ని కమలం గూటికి చేర్చే పనిలో ఉన్నారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. త్వరలో కాంగ్రెస్‌కు చెందిన ఒకరిద్దరు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ గా రేవంత్ ఈ విషయాన్ని బయటపెట్టి.. కేటీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.