బీజేపీలో చేరిన బూర

మునుగోడు ఉప ఎన్నిక ముందు కారు దిగిన భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నర్సయ్య గౌడ్‌ కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రులు భూపేంద్రయాదవ్‌, కిషన్‌రెడ్డి, భాజపా తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌ ఛుగ్‌, భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ లక్ష్మణ్‌ తదితరుల సమక్షంలో ఆయన కమల తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్‌ మాట్లాడుతూ.. “నిష్పక్షపాతంగా ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడమే నా ప్రధాన కర్తవ్యం. ఐదేళ్ల కాలంలో ప్రధాని మోడీ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పనులను తెలంగాణకు, ప్రత్యేకంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి తీసుకొచ్చాను. సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌.. అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తాను. తెలంగాణ, దేశ అభివృద్ధి కోసం నా జీవితాన్ని అంకితం చేస్తా”నని అన్నారు.