కోహ్లీ కంటతడి.. బ్రదర్స్ రొమాన్స్

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. విరాట్ కోహ్లీ (82*) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హార్దిక్‌ పాండ్య (40)తో కలిసి శతక భాగస్వామ్యం నిర్మించాడు. ఓడిపోతామనుకొన్న మ్యాచ్‌ను చివరి వరకూ క్రీజ్‌లో నిలబడి కోహ్లీ గెలిపించాడు.

మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. “మాటలు రావడం లేదు. ఇదొక అద్భుతమైన విజయం. మనం సాధించగలమని హార్దిక్‌ నమ్మాడు. చివర వరకూ క్రీజ్‌లో ఉంటే సాధ్యమేనని అనుకొన్నాం. పెవిలియన్‌ ఎండ్‌ నుంచి బౌలింగ్‌ చేసిన షహీన్‌ షా అఫ్రిదిని టార్గెట్‌ చేయాలని భావించాం. అలాగే హారిస్‌ రవుఫ్ వారికి చాలా కీలక బౌలర్. ఒక్కసారి హారిస్‌ను ఎటాక్‌ చేస్తే తప్పకుండా పాక్‌ ఒత్తిడికి గురి అవుతుందని తెలుసు. చివరి ఓవర్‌ నవాజ్‌ వేస్తాడు ముందే అనుకొన్నాం. 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన తరుణంలో రెండు సిక్స్‌ కొట్టడం నిజంగా అద్భుతం. చివరికి 6 బంతుల్లో లక్ష్యం 16కి వచ్చింది. నా శక్తిసామర్థ్యం మీద నమ్మకం ఉంచా. ఇప్పటి వరకు మొహాలీ వేదికగా ఆస్ట్రేలియా మీద ఆడిన ఇన్నింగ్స్‌ నా అత్యుత్తమంగా ఉండేది. ఇప్పుడు ఆ జాబితాలోకి తాజా ఇన్నింగ్స్‌ వచ్చి చేరింది. హార్దిక్‌ చాలా మద్దతుగా నిలిచాడు. భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడం అద్భుతం. మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు.’’ అని తెలిపాడు.

కోహ్లీ కంటతడి :

“నేను చాలా ఏళ్లుగా విరాట్ కోహ్లీని చూస్తున్నా. కానీ, ఎప్పుడూ కంటితడి చూడలేదు. తొలిసారి పాక్‌ మీద విజయం తర్వాత ఇవాళ చూశా. ఇది ఎప్పటికీ మరువలేని సంఘటన’’ అని హర్షా భోగ్లే అన్నారు. ఇక గ్రౌండ్ లో కోహ్లీని రోహిత్ ఎత్తుకొని సెలబ్రేట్ చేసుకున్న వీడియో ఆకట్టుకుంటోంది. దీనికి బ్రదర్స్ రొమాన్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.