రాజాసింగ్‌పై పీడీ యాక్టు.. సమర్థించిన అడ్వైజరీ బోర్డు

గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పీడీ యాక్ట్‌ అడ్వైజరీ బోర్డులో ఎదురు దెబ్బతగిలింది. అతనిపై పీడీ యాక్టు నమోదు చేయడాన్ని అడ్వైజరీ బోర్డు సమర్థించింది. తనపై అక్రమంగా నమోదు చేసిన పీడీ యాక్టును తొలగించాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ బోర్డుకు విజ్ఞప్తి చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరైన ఎమ్మెల్యే.. తనపై కక్షపూరితంగా పీడీ యాక్టు కేసు నమోదు చేశారని తెలిపారు. ఒక రాజకీయ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నందున కక్షతో పీడీ యాక్టు ప్రయోగించారని ఆరోపించారు.

ఈ ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. రాజాసింగ్‌ విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, కొన్ని వర్గాల మధ్య చిచ్చురేపే విధంగా వ్యహరించడం వల్లే పీడీ యాక్టు ప్రయోగించామని వివరించారు. గతంలో అతనిపై వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను బోర్డు ముందుంచారు. ఇరువర్గాల వాదనలు విన్న అడ్వైజరీ బోర్డు .. పీడీ యాక్టును కక్షపూరితంగా ప్రయోగించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అభిప్రాయపడింది. పోలీసులు పీడీ యాక్టు నమోదు చేయడాన్ని సమర్థించింది. దీనిపై రాజాసింగ్‌ తరఫు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.