ఎయిర్ పోర్ట్ తరహాలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌

సికింద్రాబాద్‌లోని రైల్వేస్టేషన్‌ ఇక విమానాశ్రయాన్ని తలపించేలా..అంతర్జాతీయ ప్రమాణాలు, వసతులతో అత్యాధునికంగా రూపుదిద్దుకోనుంది. ఇందుకుగాను రూ.726 కోట్లతో పనులు చేపట్టడానికి రంగం సిద్ధమైంది. ఈమేరకు రైల్వేశాఖ టెండర్లు పిలవగా 8 సంస్థలు పోటీపడ్డాయి. దిల్లీకి చెందిన గిరిధర్‌లాల్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రై.లిమిటెడ్‌ సంస్థ పనులను దక్కించుకుంది. 36 నెలల్లో పనులను పూర్తిచేయాలని రైల్వేఅధికారులు ఆ సంస్థకు స్పష్టం చేశారు.

అందుబాటులోకి వచ్చే వసతులివే..

  •  రైల్వేస్టేషన్‌కు ఉత్తరం వైపు 5 అంతస్తుల్లో మల్టీలెవల్‌ పార్కింగ్‌. దక్షిణదిశలో భూగర్భ పార్కింగ్‌.  
  •  ఉత్తర (22,516 చదరపు మీటర్లు), దక్షిణ (14,792 చ.మీ.లు) దిశల్లో ‘జీ+3’ అంతస్తులతో భవనాలు.  
  •  108 మీటర్ల ఎత్తుతో రెండంతస్తుల ‘స్కై కాన్‌కోర్స్‌’ నిర్మాణం. మొదటి అంతస్తును ప్రయాణికుల కోసం.. రెండోది ఫ్లోర్‌ రూప్‌టాప్‌ ప్లాజాగాను రూపొందిస్తారు.  
  •  ప్రస్తుతం సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ట్రాక్‌లపై ఎలాంటి నిర్మాణాలు లేవు. తాజా ప్రణాళిక ప్రకారం కింద రైల్వే ట్రాక్‌లు ఉంటే.. వాటిపైన భవనం ఉంటుంది.  
  •  ఉత్తర, దక్షిణ భవనాలకు రెండు వైపులా ట్రావెలేటర్‌తో పాటు రెండు నడక మార్గాలు (7.5 మీటర్లు). నేలపై ఉండే వీటిమీద నిల్చుంటే చాలు.. ముందుకు తీసుకెళతాయి.  
  •  పక్కనే ఉన్న మెట్రోస్టేషన్‌తో అనుసంధానం. రైలు దిగిన ప్రయాణికులు ఎస్కలేటర్‌ ద్వారా వెళ్లేలా ఏర్పాట్లు.  
  •  5,000 కిలోవాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్‌ ఏర్పాటు.  
  •  రైల్వే స్టేషన్‌లోకి వచ్చేందుకు, బయటకు వెళ్లేందుకు వేర్వేరుగా బ్లాక్‌ల నిర్మాణం. ప్రయాణికుల్ని తీసుకురావడానికి (డ్రాప్‌), తీసుకెళ్లడానికి (పికప్‌) వేర్వేరు పాయింట్ల ఏర్పాటు.  
  •  స్టేషన్లో ఉన్న 10 ప్లాట్‌ఫారాల ఆధునికీకరణ.