మనల్ని ఎవడ్రా ఆపేది.. మోడీతో పవన్ భేటీ.. !

విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ ఖరారైంది. శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ప్రధాని బస చేసే చోళ సూట్లో వీరిద్దరి సమావేశమూ ఉండబోతోంది. జనసేన, టీడీపీ దగ్గరవుతున్న సమయంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

మొదటి నుంచి పవన్ బీజేపీకి మద్దతుగా పని చేస్తున్నారు. 2014 లో జనసేన ఎన్నికల బరిలో దిగకపోయినా.. టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికింది. ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి గెలుపొందడంతో పవన్ కీలక పాత్ర పోషించారు. ఇక 2019లో ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల తర్వాత కొన్నాళ్లకు జనసేన, భారతీయ జనతా పార్టీ కలసి ప్రయాణం చేయనున్నట్లు ప్రకటించాయి. 2020 జనవరి నుంచి జనసేన-బీజేపీ పొత్తు కొనసాగుతుంది.

అయితే ఈ రెండు పార్టీలు కలిసి కార్యక్రమాలు నిర్వహించలేదు. దీనిపై ఇటీవల పవన్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వైకాపా ప్రభుత్వంపై పోరాటానికి తనకు రూట్ మ్యాప్ ఇస్తామని బీజేపీ నాయకులు చెప్పారని, అది ఇంకా ఇవ్వలేదని పవన్ అన్నారు. ఈ నేపథ్యంలో తమ వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరముందన్నారు. టీడీపీకి దగ్గరవుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మోడీతో పవన్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానితో భేటీ తర్వాత పవన్ కు రూట్ మ్యాప్ ఇవ్వడం గ్యారంటీ అని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు.. పవన్ ఇమేజ్ వేరు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ.. జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.