BRS ఆవిర్భావం.. సంతకం చేసిన కేసీఆర్ !

తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత్ రాష్ట్ర సమితిగా మార్పు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారాస ఆవిర్భావానికి సంబంధించి ఈసీ పంపిన లేఖపై కేసీఆర్ సంతకం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన భారాస ఆవిర్భావ వేడుకల్లో తొలుత కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఆ తర్వాత ఈసీ పంపిన లేఖకు అంగీకారం తెలుపుతూ సుముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 1.20 గంటలకు కేసీఆర్ సంతకం చేశారు. దీంతో భారత్ రాష్ట్ర సమితి అమల్లోకి వచ్చినట్లయింది. కేసీఆర్ సంతకం చేసిన లేఖను అధికారికంగా ఈసీకి పంపనున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 14న BRS కార్యాలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ అనేది భారాస నినాదమని చెప్పారు. నా ప్రతి ప్రస్థానంలో అవహేళనలు సర్వసాధారణం. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ కోసం తెరాస ఏర్పాటు సమయంలోనూ ఎన్నో విమర్శలు చేశారు. ప్రతికూల పరిస్థితులు అధిగమించి తెలంగాణ సాధించాం. దేశ పరివర్తన కోసమే భారాస ఏర్పాటు చేశాం. దిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే. దేశానికి ఇప్పుడు కొత్త ఆర్థిక విధానం అవసరం. మహిళా సాధికారత కోసం కొత్త జాతీయ విధానం తీసుకొస్తాం. జాతీయస్థాయిలో కొత్త పర్యావరణ విధానం కావాలి. ఇకపై రాష్ట్రాల మధ్య జల యుద్ధాలు ఉండవు. కర్ణాటక-తెలంగాణ సరిహద్దుల్లో తెలుగువాళ్లు ఉన్నారు. తెలుగువాళ్ల కోసం భారాస కృషి చేస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో భారాస పోటీ చేస్తుంది. కుమారస్వామి మళ్లీ కర్ణాటక సీఎం కావాలి అని కేసీఆర్ అన్నారు.

