కాషాయం.. పసుపు కానుందా ?

కాషాయం కలర్ అంటే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఎనలేని ప్రేమ. అయితే ఇటీవల కాలంలో ఆయనకు ప్రేమ తగ్గింది. ఏకంగా కాషాయం వదిలేసి.. పసుపు వస్త్రాలు కట్టుకునేందుకు ఆయన రెడీ అవుతున్నారు. రాజసింగ్ అతి త్వరలో టీడీపీలో చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ ప్రచారంపై రాజాసింగ్ స్పందించారు. తాను టీడీపీలో చేరుతున్నట్టు వస్తున్న వదంతులలో ఏమాత్రం నిజం లేదు. తెలుగుదేశం పార్టీలో చేరబోనని తేల్చి చెప్పారు. ఎప్పటికీ బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. అటు టీఆర్ ఎస్, ఇటు ఎంఐఎం హవా తట్టుకొని గోషామహల్ నుంచి ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఇరుక్కుల్లో పడుతున్నారు. ఆయన్ని బీజేపీ అధిష్టానం కూడా లైట్ తీసుకుంది. అరెస్ట్ అయినప్పుడు, ఆయనపై పీడీ యాక్టులు నమోదు చేసినప్పుడు.. పార్టీ నుంచి పెద్దగా సపోర్ట్ లభించకపోవడంపై రాజాసింగ్ అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీ లోకి వెళ్లబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు.