కవిత-సంజయ్ ఆత్మీయ పలకరింపు

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఆత్మీయంగా పలకరించుకోవడం ఆకట్టుకుంది. బుధవారం నిజామాబాద్‌లో బీజేపీ నేత బస్వ నర్సయ్య నూతన గృహ ప్రవేశం కార్యక్రమానికి సంజయ్‌ హాజరయ్యారు. అదే కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత సైతం రాగా, ఇద్దరు పరస్పరం ఎదురై నమస్కారం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఇద్దరు నేతలు నవ్వుతూ కనిపించారు. కొద్దిసేపు రాజకీయ శత్రుత్వం పక్కన పెట్టి.. ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా, జిల్లా జడ్పీ ఛైర్మన్‌ విఠాల్‌ రావును సంజయ్‌కు.. కవిత పరిచయం చేశారు. 

మరోవైపు ఈ పలకరింపులు బీజేపీని మరింత డ్యామేజ్ చేసేలా ఉందని కమలం పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఇప్పటికే బీజేపీ – బీఆర్ఎస్ ఒక్కటే అనే ప్రచారం జరుగుతుంది. గల్లీ కుస్తీ.. ఢిల్లీ లో దోస్తీ అని ఆరోపిస్తున్నారు. అందుకే ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత ను అరెస్ట్ చేయడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. సంజయ్-కవిత ఆత్మీయ పలకరింపు బీజేపీకి ఓ రకంగా మైనస్ కాగా.. బీఆర్ ఎస్ కు ప్లస్ అవుతుందని ఓ అంచనా వేస్తున్నారు.