గుడ్ న్యూస్ : వర్షాలు తగ్గుముఖం పట్టినట్టే.. వాతావరణశాఖ ప్రకటన

గత పదిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ వణికిపోతున్న సంగతి తెలిసిందే. వాగులు వంకలు పొంగిపోర్లుతుండటంతో.. చాలా చోట్ల ప్రమాద ఘటికలు మ్రోగితున్నాయి. వాతావరణ శాఖ మరో రెండ్రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే తాజాగా వాతావరణ శాఖ నుంచి గుడ్ న్యూస్ అందింది. ఇక వర్షాలు తగ్గుముఖం పట్టినట్లేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఈరోజు ఉదయం అల్పపీడనంగా బలహీనపడిందని, మరొక అల్పపీడనం ఏర్పడితేనే తప్ప ఇక భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్లేనని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె.నాగరత్న తెలిపారు.

‘‘తెలంగాణపై నైరుతి రుతుపవనాలు ఉద్ధృతంగా ఉన్నాయి. తాజాగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద వర్షాలుగా నమోదయ్యాయి. హనుమకొండ సహా ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో కొన్ని చోట్ల అసాధారణమైన భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, కుమురంభీమ్‌ జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షం కురిసింది. ఆగస్టు రెండో వారం, సెప్టెంబరులో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఎలాంటి హెచ్చరికలు లేవు” అని ఆమె తెలిపారు.