మంత్రి మల్లారెడ్డి సెల్ఫ్ గోల్ !

మంత్రి మల్లారెడ్డి కల్వకుంట్ల కుటుంబం భజనపరుడు. భక్తుడు అన్న సంగతి తెలిసిందే. ఆయనపై అవినీతి, అక్రమాలు, భూ కబ్జా ఆరోపణలున్నా.. దానికి సంబంధించిన ఆడియో టేప్ లు సోషల్ మీడియాలో వైరల్ అయినా.. బేఫికర్ గా తిరిగాడు మల్లారెడ్డి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ధీమాతో ముందుకు పోతున్నడు. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా.. ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే పనులు చేసిన బీఆర్ఎస్ హైకమాండ్ లైట్ తీసుకున్నది.

అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వ వాస్తవ పరిస్థితిని కుండబద్దలు కొట్టి అడ్డంగా బుక్కయ్యారు. “మా తొమ్మిదేళ్ల పాలన జోర్ దార్” అంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చిన రోజే.. నెల జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని మల్లారెడ్డి కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. శనివారం మంత్రి మల్లారెడ్డి.. తన సొంత నియోజకవర్గం మేడ్చల్ లోని శామీర్ పేట మండలం అలియా బాద్ లో పర్యటించారు.

ఈ సందర్భంగా మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. గ్రామంలోని మురుగునీటి సమస్య, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై ప్రజలు నిలదీశారు. వారికి సమాధానం చెప్పే క్రమంలో మంత్రి.. రాష్ట్ర పరిస్థితి ఏం బాగులేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేం. అసలు నెలజీతాలు కూడా చెల్లించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని చెప్పుకొచ్చారు.

మంత్రి మాటలు అన్ని న్యూస్ ఛానెల్స్ లో టెలికాస్ట్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో.. కేసీఆర్, కేటీఆర్ దగ్గర తనకున్న ఇమేజ్ బర్ బాజ్ అయిందని మల్లారెడ్డి బాధపడుతున్నట్లు సమాచారం. అంతేకాదు.. మీకు నచ్చితే ఈసారి నాకు ఓటు వేయండి. నాకంటే మంచోడొస్తే.. వాడికి ఓటెయ్యిర్రి అంటూ సమాధానం ఇచ్చారు. అక్కడితో ఆగకుండా తనకు ప్రశ్నించిన వారంతా బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందినోళ్లు.. సమస్యలపై మీ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలని అడగమని చీఫ్ కామెంట్ చేసి.. వివాదంలో చిక్కుకున్నారు.