తెలంగాణ ప్ర‌భుత్వ‌ ప్రాధాన్య‌త‌లు భేష్.. ప్ర‌పంచ బ్యాంక్ ప్ర‌తినిధి బృందం కితాబు

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విష‌యంలో  ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌లు బాగున్నాయ‌ని ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధి బృందం ప్ర‌శంసించింది. గ‌త నెల‌లో వాషింగ్ట‌న్‌లో ప్ర‌పంచ‌బ్యాంక్ అధ్య‌క్షుడు అజ‌య్ బంగాతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయిన విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో తదుప‌రి చ‌ర్చ‌ల కోసం  ప్ర‌పంచ‌బ్యాంకు ద‌క్షిణాసియా ప్రాంత ఉపాధ్య‌క్షుడు మార్టిన్ రైజ‌ర్ నేతృత్వంలో వ‌ర‌ల్డ్ బ్యాంక్‌  కంట్రీ ఆప‌రేష‌న్ హెడ్ పాల్ ప్రోసీ, అర్బ‌న్ ఇన్‌ఫ్రా, ప్రాజెక్ట్ లీడ్ న‌టాలియా కే, డిజిట‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ సీనియ‌ర్ స్పెష‌లిస్ట్ మ‌హిమాప‌త్ రే శ‌నివారం హైద‌రాబాద్ వ‌చ్చారు.  రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో వారు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప‌ట్ట‌ణ మౌలిక వ‌స‌తుల అభివృద్ధి, విద్యా, వైద్య‌, సాగు నీటి రంగాల‌ను త‌మ ప్ర‌భుత్వ ప్రాధాన్యాలుగా పెట్టుకున్నామ‌ని, ఆయా రంగాల్లో తాము తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వారికి వివ‌రించారు.

తాము ప్రాధాన్యంగా తీసుకుంటున్న ప్రాజెక్టుల‌కు ఆర్థిక స‌హకారంతో పాటు అత్యుత్త‌మ ప్ర‌మాణాల‌తో తెలంగాణ ప్రాజెక్టులు నిలిచేందుకు స‌హ‌క‌రించాల‌ని ముఖ్య‌మంత్రి కోరారు. విద్యా, వైద్య రంగాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దార్శ‌నిక‌త బాగుంద‌ని, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణ‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని మార్టిన్ రైజ‌ర్ ప్ర‌శంసించారు. ప్ర‌పంచ బ్యాంకు ఏ రంగాలను ప్రాధాన్య అంశాలుగా ఎంచుకుందో అవే తెలంగాణ ప్ర‌భుత్వ ప్రాధాన్య అంశాలుగా ఉన్నాయ‌ని మార్టిన్ రైజ‌ర్ అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించేందుకు తాము ఆస‌క్తిగా ఉన్నామ‌ని ఆయ‌న తెలిపారు. స‌మావేశంలో రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ వి.శేషాద్రి, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శులు సంగీత స‌త్య‌నారాయ‌ణ‌, మాణిక్ రాజ్‌, ఆర్థిక శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి దాన‌కిశోర్‌, వైద్యారోగ్య శాఖ కార్య‌ద‌ర్శి క్రిస్టియానా జోంగ్తూ, ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.