కర్ణిసేనకు కంగనా హెచ్చరికలు

బాలీవుడ్‌ హీరోయిన్ కంగనా రనౌత్‌ కర్ణిసేన కార్యకర్తలను హెచ్చరించింది. కంగనా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే, ఈ సినిమాను విడుదలని ఆపాలంటూ రాజ్ పుత్ కర్ణిసేన సంఘ కార్యకర్తలు ఎప్పటినుంచో ఆందోళన చేస్తున్నారు. సినిమాలో లక్ష్మీబాయి ఓ బ్రిటిష్‌ వ్యక్తితో ప్రేమలో పడినట్లు చూపించారని, ఆ సన్నివేశాలను తొలగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కర్ణిసేన బెదిరింపులకు పాల్పడుతోంది.

తాజాగా, కర్ణిసేన బెదిరింపులపై హీరోయిన్ కంగనా రనౌత్‌ స్పందించారు. ‘మణికర్ణిక సినిమాకు నలుగురు చరిత్రకారులు ఆమోదం తెలిపారు. సెన్సార్‌ బోర్డు కూడా సర్టిఫికేట్‌ జారీ చేసింది. ఇప్పటికీ కర్ణిసేన ఆందోళనలు ఆపకపోతే నేను కూడా వారిలాగే ప్రవర్తించాల్సి ఉంటుంది. నేను రాజ్‌పుత్‌ను. వారందరినీ నాశనం చేస్తాను’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది కంగన. కంగనా హెచ్చరికల నేపథ్యంలో కర్ణిసేన తగ్గితుందా.. ? ఆందోళనలకి పులిస్టాప్ పెడుతుందా.. ?? అన్నది చూడాలి.