మహిళలు సిరీస్ గెలిచారు

న్యూజిలాండ్ గడ్డపై కోహ్లీ సేన సిరీస్ గెలిచేసింది. ఐదు వన్డేల సిరీస్ ని మరో రెండు వన్డేలు మిగిలివుండగానే 3-0 తేడాతో కైవసం చేసుకొంది. ఇదే తరహా టీమిండియా మహిళా జట్టు న్యూజిలాండ్ గడ్డపై సిరీస్ ని సొంతం చేసుకొంది. మూడు వన్డేల సిరీస్ ని మరో మ్యాచ్ మిగిలివుండానే మిథాలీసేన గెలుచుకొంది. మొదటి వన్డే 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన మిథాలీ సేన మంగళవారం జరిగిన రెండో వన్డేలోనూ కివీస్ 8 వికెట్లతో ఓడించింది. వరుసగా రెండు వన్డేల్లో ఘన విజయంతో 2-0తేడాతో సిరీస్ గెలుచుకొంది.

రెండో వన్డేలో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న మిథాలీ సేన అద్భుతమైన బౌలింగ్‌తో కివీస్‌ జట్టును 161 పరుగులకు ఆలౌట్‌ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు.. ఆరంభంలో కాస్త తడబడింది. తొలి ఐదు ఓవర్లలోనే ఒపెనర్‌ జెమిమా రోడ్రిగ్స్‌(0), దీప్తి శర్మ(8) ఔటయ్యారు. అయితే ఆ తర్వాత స్మృతి(90), మిథాలీ(63) కలిసి 151 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించారు.