ప్రయోగాలతో భారత్‌..?


ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య రాంచీలోని జేఎస్‌సీఏ మైదానంలో శుక్రవారం మూడో వన్డే జరగనుంది. ఐదు వన్డేల క్రికెట్‌ సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ఆసీస్‌ 2-0తో వెనుకబడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిచి ముందే సిరీస్‌ కైవసం చేసుకోవాలని భారత్‌ పట్టుదలతో ఉంది. మరోవైపు మూడో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ విజయ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని ఆసీస్‌ భావిస్తోంది.

కోహ్లీసేన మిగిలిన మూడు మ్యాచుల్లో ప్రయోగాలు చేయాలా లేక గెలిచిన జట్టుతోనే ఆడాలా అనే డైలమాలో పడింది. టీ20ల్లో ఆకట్టుకున్న కేఎల్‌ రాహుల్‌కు అవకాశం ఇవ్వాలనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. యువ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌పంత్‌ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం రాలేదు. వికెట్‌ కీపర్‌గా ధోనీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఒకవేళ రిషబ్‌కు అవకాశం ఇవ్వాలంటే బ్యాట్స్‌మెన్‌గా తీసుకోవచ్చు.

టీ20 సిరీస్‌తో పాటు మొదటి రెండు వన్డేల్లో మైదానానికి దూరంగా ఉన్న భువనేశ్వర్‌కుమార్‌ విషయంలోనూ ఇదే పరిస్థితి. వన్డేలు,టీ20ల్లో భువనేశ్వర్‌ ఈ మధ్యకాలంలో పెద్దగా రాణించింది లేదు. కాబట్టి భువనేశ్వర్‌ మిగిలిన మూడు మ్యాచులకు జట్టులో ఉంటాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది.సిరీస్‌తో పాటు ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకోనుంది. మరోవైపు ధోనీకి రాంచీ సొంతగడ్డ కావడంతో స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయే అవకాశం ఉంది.