జేడీతో ట్విట్టర్ ఫైట్ పీక్స్.. !

వైకాపా కీలక నేత విజయసాయి రెడ్డి జనసేన నేత జేడీ లక్ష్మీనారాణపై ట్విట్టర్ ఫైట్ కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా, మరో షాకింగ్ ట్విట్ చేశాడు. “చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే జేడీ గారికి మా పార్టీలో ఎన్నటికీ స్థానం లేదు” అని రాసుకొచ్చాడు.

ఇటీవల జేడీ పొలిటికల్ ఎంట్రీపై విజయసాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘జేడీ గారూ… మీరు 2 నెలల క్రితం లోక్ సత్తా కండువా కప్పుకోబోయి… నెల క్రితం భీమిలిలో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీకి రెడీ అయ్యి…ఆ తర్వాత 2 రోజుల్లోనే జనసేన తరఫున విశాఖ ఎంపీగా బరిలోకి దిగారు. 3 నెలల్లో 3 పార్టీలు! అహా… ఏమి ప్రజాస్వామిక విలువలు? ఏమి రాజకీయ విలువలు?’ అంటూ ట్విట్ చేశారు. ఈ వ్యాఖ్యలని జేడీ గట్టిగానే తిప్పికొట్టారు.

‘నేను రాజకీయాల్లో చేరతానని చెప్పగానే, అన్ని పార్టీలు వారి ప్రతినిధులను పంపి మా పార్టీలో చేరండి అని ఆహ్వానం పంపాయి. ఈ లిస్టులో మీరు కూడా ఉన్నారు. మీరే మీ పార్టీలో నాకు ఎర్ర తివాచీ వేసి ఆహ్వానిస్తానన్న విషయం మీరు ఎక్కడా బహిర్గతం చేయట్లేదు. దీనిబట్టి మీరు ఎన్ని విషయాలు ప్రజల దగ్గర దాస్తున్నారో తెలుస్తుంది. మీ ఆహ్వానాన్ని గౌరవంగా తిరస్కరించినందుకు మీ బాధను మరో రూపంలో వ్యక్తం చేస్తున్నారా?’ అంటూ జేడీ రీ-ట్విట్ చేశారు.

తాజాగా, జేడీ ట్విట్ కు విజయ్ సాయి రెడ్డి సమాధానం ఇచ్చారు. ‘చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే జేడీ గారికి మా పార్టీలో ఎన్నటికీ స్థానం లేదు. ఉండదు కూడా. బహుశా ఆయనే చేరాలనుకున్నారేమో. కోవర్టు ఆపరేషన్ల కోసం వచ్చే ఆలోచన చేశారని ఇప్పడు అనిపిస్తుంది. సీబీఐ లాంటి సంస్థను బాబుకు పాదాక్రాంతం చేసిన వ్యక్తి దేశాన్ని మార్చే కలలు కంటున్నాననడం పెద్ద జోక్’ అంటూ విజయ సాయి రెడ్డి ట్విట్ చేశారు.

ఇక, ట్విట్టర్ ఫైట్ లో జేడీ ఇప్పటికే చేతులెత్తేశాడు. ‘మీ అసత్య ట్వీట్లకు సమాధానమిస్తూ నా అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోలేను. ఇది మీరు గమనించగలరు. ఇకపై మీ ట్వీట్లకు మా జనసైనికులు అవసరం అనుకుంటే సమాధానమిస్తారు’ జేడీ తెలిపారు. అయినా.. విజయసాయి రెడ్డి మాత్రం తగ్గడం లేదు. ఆయన జేడీ, చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వరుస ట్విట్లు చేస్తూనే ఉన్నారు. వన్ సైడ్ వార్ అన్నమాట. ఈ వార్ లో ఏపీలో జగన్ గెలిస్తే విజయ్ సాయిదే విజయం. లేదంటే.. ? జేడీ గెలిచినట్టుగా భావించాలేమో !