పంత్.. భారత భవిష్యత్ !

ధోనీ శాశ్వతంగా ఏమీ ఆడడు. డీకే సైతం శాశ్వతం కాదు. రిషభ్ పంత్ నే భారత భవిష్యత్. పంత్ 15 యేళ్ల పాటు జట్టుకు ప్రాతినిధ్యం వహించగలడు. ప్రపంచకప్ జట్టులో చోటుదక్కపోవడంపై పంత్ బాధపడాల్సిన పనిలేదన్నారు టీమిండియా మాజీ సారధి సౌరవ్‌ గంగూలీ. అనుభవం, అంతర్జాతీయ మ్యాచుల్లో ఒత్తిడి దృష్ట్యా పంత్‌ను కాదని దినేశ్‌ కార్తీక్‌ను సెలక్టర్లు బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఐతే, ఒక సెలక్టర్‌గా తానైతే పంత్‌ను ఎంచుకుంటానని దాదా చెప్పడం విశేషం.

ప్రస్తుతం ఐపీఎల్ లో దాదా ఢిల్లీ జట్టు సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. జైపుర్‌లో ఢిల్లీ గెలిచిన తర్వాత పంత్ ని దాదా ఎత్తుకొని అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. పాత అలవాట్లు అంత సులభంగా పోవుగా. జట్టును విజయవంతంగా నడిపించేందుకు ఎంతో అంకితమవుతాం. మరి గెలిచినప్పుడు చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది కదా అని పంత్ ని ఎత్తుకోవడంపై దాదా వివరణ ఇచ్చారు.